బెంగళూరుకు చెందిన తెలుగు, కన్నడ టీవీ సీరియల్ నటి రజిని (41), సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురైంది. ‘నవీంజ్’ అనే యూజర్ పేరుతో ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి, మూడు నెలల క్రితం ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ను ఆమోదించిన తర్వాత, ప్రతిరోజూ మెసెంజర్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడం ప్రారంభించాడు. రజిని ఆ వ్యక్తిని బ్లాక్ చేసినప్పటికీ, అతను కొత్త అకౌంట్లను క్రియేట్ చేసి వేధింపులను కొనసాగించాడు.
ఆ వ్యక్తి పలు ఫేక్ ఐడీల ద్వారా అశ్లీల సందేశాలతోపాటు, తన ప్రైవేట్ పార్టుల వీడియోలను కూడా పంపాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. నవంబర్ 1వ తేదీన పంపించిన మెసేజ్లో ఆ వ్యక్తి తనను కలవాలని కోరడంతో, నటి రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, ఆమె సాక్ష్యాధారాలతో పోలీసులను ఆశ్రయించింది.
నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని నవీన్ కె మోన్గా గుర్తించారు. అతను బెంగళూరులోని గ్లోబల్ టెక్నాలజీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్ గా పనిచేసినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు వెంటనే నవీన్ కె మోన్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నటి రజిని ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో, వేధించిన వ్యక్తికి దెబ్బకు దిమ్మతిరిగిపోయింది.









