దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ సుమారు ఐదు నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చారు. గత జులై 23న ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో పాదానికి గాయమైన కారణంగా పంత్ వెస్టిండీస్తో జరిగిన స్వదేశీ సిరీస్కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్లో ఆడుతున్న శుభ్మాన్ గిల్ ఈ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
రిషభ్ పంత్ మ్యాచ్లు ఆడేందుకు పూర్తిగా ఫిట్గా ఉన్నట్టు గుర్తించిన బీసీసీఐ, అతన్ని సౌతాఫ్రికా-ఎ, ఇండియా-ఎ మధ్య జరుగుతున్న రెండు అనధికారిక టెస్టులకు కూడా ఎంపిక చేసింది. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్ 14న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ నవంబర్ 14 నుండి 18 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది, ఇక రెండవ టెస్ట్ గౌహతిలోని ACA స్టేడియంలో జరగనుంది. పంత్తో పాటు, మునుపటి సిరీస్లో జట్టులో లేని యువ బౌలర్ ఆకాష్ దీప్ కూడా ఇప్పుడు జట్టులోకి తిరిగి వచ్చాడు.
ఇదిలా ఉండగా, గత టెస్ట్ సిరీస్లో భాగంగా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు, వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ఎన్. జగదీశన్ మరియు ఫాస్ట్ బౌలర్ ప్రసాద్ కృష్ణను బీసీసీఐ ఈ సిరీస్ నుంచి తప్పించింది. పంత్ తిరిగి రావడంతో జగదీశన్కు స్థానం దక్కలేదు. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత, రెండు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు కూడా ఆడనున్నాయి.









