తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ (61) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) కారణమని గాంధీ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా నిర్ధారించారు. లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున కుప్పకూలిపోయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూర మాట్లాడుతూ, అందెశ్రీ గత 15 ఏళ్లుగా తీవ్రమైన అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే, ఆయన గత నెల రోజులుగా రక్తపోటును నియంత్రించే మందులను వాడటం లేదని కుటుంబసభ్యుల ద్వారా తెలిసిందన్నారు. గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన ఆసుపత్రికి వెళ్లకపోవడం, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపడం ఈ విషాదానికి దారితీసిందని వైద్యులు స్పష్టం చేశారు.
గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి, బడి మెట్లు ఎక్కకుండానే తన సహజ ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగిన అందెశ్రీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన రచించిన ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట, ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆయనకు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహితీసేవకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.









