బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ (MGB) కూటమి ప్రదర్శనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ, పార్టీ తన ఓటమికి గల కారణాలపై లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్డీయే కూటమి దాదాపు 200 స్థానాల వరకు గెలుపొందే దిశగా కొనసాగుతుండగా, మహాఘట్బంధన్ కూటమి 40 స్థానాల కంటే తక్కువకు పరిమితమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని, ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించాలని ఆయన పార్టీ అధిష్టానానికి సూచించారు.
ఈ ఎన్నికల ప్రచారానికి తనను ఆహ్వానించలేదని, అందుకే తాను ప్రచారంలో పాల్గొనలేదని శశిథరూర్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి ఇంత భారీ ఆధిక్యంలో కొనసాగడానికి గల కారణాలను చాలా క్షుణ్ణంగా, వివరంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో, ఈ విషయాల్లో కేవలం ఒక పార్టీ పనితీరును కాకుండా, మొత్తం కూటమి (మహాఘట్బంధన్) పనితీరును పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
అయితే, శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత సంస్కరణలను కోరుతూ లేఖ రాసిన ‘జీ23’ బృందంలో శశిథరూర్ కూడా ఒకరు కావడం, ఇలాంటి కీలక సమయాల్లో ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధిష్టానం నిర్ణయాలపై అసంతృప్తి ఉన్నా, బీహార్ ఫలితాల నేపథ్యంలో పార్టీలో నిర్మాణాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.









