తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటితో (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం, మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత రెండేళ్లలో మొత్తం 251 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 8,459 కోట్లుగా నమోదైంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, విద్య, ఆధ్యాత్మిక ప్రయాణాలు మరియు కుటుంబ బంధాలు పెంచుకోవడం సులువయ్యిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ సాధారణ బస్సుల్లో అమలువుతున్న ఈ పథకాన్ని త్వరలోనే అన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డును చూపించి ఉచిత ప్రయాణం చేస్తుండగా, భవిష్యత్తులో ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యోచిస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే, వాటిని ఉపయోగించి మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది.









