నిజాయతీ, పనితీరు ఆధారంగానే పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, మంగళగిరిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ప్రకటించారు. పల్లెలే దేశానికి వెన్నెముకగా ఉండటంతో, ప్రజల సంక్షేమం కోసం పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నట్లు తెలిపారు. పదోన్నతులు కల్పించడంలో సీనియారిటీ, నిజాయితీ, పనితీరు మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేశారు. “మంత్రులు సిఫార్సు చేసినా, ప్రమాణాలకు సరిపోతేనే పరిగణిస్తాము,” అని పేర్కొంటూ, రాజకీయ సిఫార్సులకు తావు ఉండదని తేల్చి చెప్పారు.

పవన్ కల్యాణ్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ, జీతాల పెంపు విషయం రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాతే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. “పని చేయకుండా, అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది?” అని ప్రశ్నించారు. ఈ శాఖలో మొత్తం 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గుర్తు చేసిన ఆయన, గత ప్రభుత్వంలో నిర్ణయించిన పోస్టులు, బదిలీ (ట్రాన్స్‌ఫర్) నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తరచూ సమీక్షలు నిర్వహించి, సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, కాంట్రాక్టర్ల బిల్లులు ఆలస్యం కాకుండా వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

రాజకీయ వ్యవస్థలో మార్పులు తప్పనిసరి అని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్, గ్రామీణాభివృద్ధికి ఈ నిర్ణయాలు తొలి అడుగులని పేర్కొన్నారు. జనసేన నాయకత్వంలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా శాఖలోని శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజ, వెంకటకృష్ణల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో, ఉద్యోగుల సమస్యలపై తనకు సానుకూల దృక్పథం ఏర్పడిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమావేశం గ్రామీణ పాలనా వ్యవస్థను మెరుగుపరచే దిశగా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు