ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంలో ఘాటు విమర్శలు చేశారు. “చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు అన్నట్లుంది కూటమి ప్రభుత్వం తీరు” అని ఆమె అన్నారు. ఏపీఈఆర్సీ (APEREC) విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ₹15,651 కోట్ల మేర వడ్డనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా, ఛార్జీల భారం పడదని చెప్పే చంద్రబాబు మాటలు పాత చింతకాయ పచ్చడితో సమానమని షర్మిల ఎద్దేవా చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు, నియంత్రణ మండలి ప్రతిపాదనలకు పొంతనే లేదని షర్మిల విమర్శించారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే ప్రజలకు సర్దుబాటు (True Up) పేరుతో గుండెపోటు తెప్పించారని, గతంలో ₹15 వేల కోట్ల మేర ట్రూ అప్ బిల్లులతో జనాల జేబులకు చిల్లులు పెట్టారని ఆమె ఆరోపించారు. “ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఇప్పటికీ అనడం తీవ్ర హాస్యాస్పదం” అని షర్మిల అన్నారు.
ప్రస్తుతం మరో ₹15 వేల కోట్లకు టైమ్ ఆఫ్ ది డే (Time of the Day) పేరుతో దోచేందుకు కసరత్తు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేసిన పాపానికి, ఏడాదికో హైటెన్షన్ షాక్ పెడుతున్నారన్న షర్మిల, లోటు పేరుతో జనాలను బాదడం అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదనేది ఆమె ప్రధాన విమర్శ.









