తాను కాంగ్రెస్లో చేరలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినేనని కడియం శ్రీహరి స్పీకర్కు అఫిడవిట్ సమర్పించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆయనపై వినూత్నంగా విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని తిరుమలనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న ఆయనకు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ జెండాలు, రంగులతో కూడిన భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఒకవైపు కడియం శ్రీహరి, మరోవైపు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఫొటోలను ఉంచి, “బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి స్వాగతం” అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి గత ఏడాది కాలంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు పడకుండా ఉండేందుకే ఆయన సాంకేతికంగా తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన జీతం నుంచి ప్రతి నెలా రూ. 5,000 బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ ఖాతాకే జమ అవుతున్నాయని ఆయన స్పీకర్కు వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకే బీఆర్ఎస్ శ్రేణులు ఈ ‘గులాబీ’ స్వాగత ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి.
ఈ ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ ఫిరాయించి మళ్లీ బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం నైతికత కాదని, వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి రాజయ్య డిమాండ్ చేశారు. పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ పరిణామం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.









