‘ద్వితా’ తుపాను ప్రభావం: తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు, విద్యా సంస్థలకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, ‘ద్వితా’ (Dithwa) తుపానుగా మారి వేగంగా తీరాల వైపు కదులుతోంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి. తీరం దాటకముందే తుపాను తన ప్రతాపాన్ని చూపించడంతో, అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా, చెన్నై సహా పలు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా, భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.

భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ‘ద్వితా’ తుపాను వాయవ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను రేపు (నవంబర్ 30) ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు.

తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని కోరుతున్నారు. తుపాను తీరం దాటే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు