థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని సంచలన విజయం సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ రూ. 17 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమాను డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ చిత్రం తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన హార్ట్ టచింగ్ ప్రేమకథ. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్ మరియు తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. నవంబర్ 21న విడుదలైన తొలి షో నుంచే సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
ఈ సినిమాను డాక్టర్ నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. శివాజీ రాజా, అనిత చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సురేష్ బొబ్బలి సంగీతం అందించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ముఖ్యంగా యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









