మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ: 20 మంది సభ్యులతో పీఎల్‌జీఏ చీఫ్ దేవా లొంగుబాటు

మావోయిస్టు ఉద్యమానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్, మోస్ట్ వాంటెడ్ నేత బర్సే సుక్కా అలియాస్ దేవా శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి సహా మొత్తం 20 మంది సభ్యులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ భారీ లొంగుబాటు పీఎల్‌జీఏ పతనానికి నాంది అని పోలీసులు భావిస్తున్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట భారీగా అత్యాధునిక ఆయుధాలను తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. ఇందులో ఇజ్రాయెల్ తయారీ టవర్ వెపన్, యూఎస్ఏ తయారీ కోల్ట్ ఆయుధాలతో పాటు 8 ఏకే-47 తుపాకులు, ఎల్‌ఎమ్‌జీలు, ఎస్‌ఎల్‌ఆర్‌లు మరియు హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధ సామగ్రి ఉండటం గమనార్హం. వీటితో పాటు తమ వద్ద ఉన్న రూ. 20 లక్షల నగదును కూడా పోలీసులకు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన దేవాపై ఎన్‌ఐఏ గతంలో రూ. 75 లక్షల రివార్డును ప్రకటించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, ప్రభుత్వం కల్పిస్తున్న ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీల పట్ల ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున మొత్తం రూ. 1.80 కోట్ల రివార్డు సొమ్మును అందజేయనున్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ. లక్ష నగదును డీజీపీ పంపిణీ చేశారు. అడవిలో అనాలోచిత పోరాటం మానుకొని, మిగిలిన సభ్యులు కూడా లొంగిపోయి సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా డీజీపీ విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు