83 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన జోగి రమేష్: చంద్రబాబు, లోకేష్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్!

నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పెద్ద ఊరట లభించింది. సుమారు 83 రోజుల రిమాండ్ తర్వాత ఆయన తన సోదరుడు రాముతో కలిసి శుక్రవారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మరియు ఉమ్మడి కడప జిల్లా ములకలచెరువు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. జైలు వద్ద జోగి రమేష్‌కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

జైలు నుంచి విడుదలైన వెంటనే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “చంద్రబాబు కక్షపూరితంగానే వైసీపీ నేతలను జైళ్లలో పెట్టి వేధిస్తున్నారు. నా కుటుంబంపై అక్రమంగా కేసులు నమోదు చేశారు” అని ఆయన ఆరోపించారు. “చంద్రబాబు, లోకేష్.. మీకూ కుటుంబాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి” అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. రాజకీయ పగతో ఇబ్బందులకు గురిచేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

కేవలం రాజకీయ నేతలపైనే కాకుండా, తనను విచారించిన మరియు జైలులో హింసించిన పోలీసు అధికారుల పట్ల కూడా జోగి రమేష్ కఠినంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సమయం వచ్చినప్పుడు వారందరికీ సమాధానం చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆయన పునరుద్ఘాటించారు. తాజా పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు