హైదరాబాద్లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ (NFDB) ప్రధాన కార్యాలయం ప్రపంచంలోని అత్యంత వింతైన మరియు అద్భుతమైన నిర్మాణాల జాబితాలో చోటు సంపాదించుకుంది. 2012లో నిర్మించిన ఈ నాలుగు అంతస్తుల భవనం అచ్చం ఒక భారీ చేప ఆకారంలో ఉండటం దీని ప్రత్యేకత. ఇది కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాకుండా, నగరానికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ఒక ముఖ్యమైన ల్యాండ్మార్క్గా మారిపోయింది. భారతదేశపు ప్రభుత్వ మౌలిక సదుపాయాలలో ఇంతటి సృజనాత్మకత ఉండటం పట్ల అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భవనం ‘మిమెటిక్ ఆర్కిటెక్చర్’ (Mimetic Architecture) కు ఒక అద్భుత ఉదాహరణ. మిమెటిక్ ఆర్కిటెక్చర్ అంటే ఒక భవనం లోపల జరిగే పనిని లేదా అక్కడ లభించే వస్తువును దాని బయటి ఆకారం ప్రతిబింబించేలా నిర్మించడం. ఇది మత్స్య శాఖకు సంబంధించిన కార్యాలయం కావడంతో, దీనిని చేప ఆకారంలో రూపొందించారు. మెటాలిక్ షీన్, పెద్ద రెక్కలు (Fins), మరియు కళ్ల మాదిరిగా కనిపించే కిటికీలతో ఈ కట్టడం అద్భుతంగా కనిపిస్తుంది. 1992లో బార్సిలోనాలో నిర్మించిన ఫ్రాంక్ గెహ్రీ ఫిష్ శిల్పం ప్రేరణతో ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పగటిపూట వెండి రంగులో మెరిసిపోయే ఈ చేప భవనం, రాత్రి వేళల్లో నీలిరంగు స్పాట్లైట్ల వెలుగులో మరింత వింతగా కనిపిస్తుంది. చీకట్లో చూస్తుంటే ఒక భారీ చేప నీటిలో ఈదుతున్నట్లు భ్రమ కలుగుతుంది. అమెరికాలోని ‘బాస్కెట్’ ఆకారపు భవనం, పోలాండ్లోని ‘క్రూక్డ్ హౌస్’ వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల సరసన ఇప్పుడు మన హైదరాబాద్ ఫిష్ బిల్డింగ్ చేరింది. సాధారణ ప్రభుత్వ కార్యాలయాలు అంటే కాంక్రీటు దిమ్మెల్లా ఉంటాయనే భావనను చెరిపివేస్తూ, ఈ సృజనాత్మక కట్టడం నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది.








