గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న జగన్, అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసి షాక్కు గురయ్యారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన కార్లను, ఇంటి కిటికీలను, ఇతర వస్తువులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో పోలీసులు భారీగా ఆంక్షలు విధించినప్పటికీ, వైఎస్సార్సీపీ నేతలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, సామాన్యులకే కాకుండా మాజీ మంత్రుల ఇళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ముమ్మాటికీ ‘జంగిల్ రాజ్’ అని అభివర్ణించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దాడులు జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కష్టకాలం ముగుస్తుందని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అంబటి కుటుంబానికి భరోసా కల్పిస్తూ, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.









