ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం విప్పింది. సభలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ గేట్ నంబర్ 1 వద్ద జగన్ తన అనుచరులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన అనంతరం జగన్ నేరుగా తన తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోయారు.
మరోవైపు, అధికార పక్షం తన పాలనా వ్యూహాలకు పదును పెడుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంశాలతో పాటు, పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 14న ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది.
అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన వైసీపీ నేతలు తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, రేపు వైసీఎల్పీ (YCLP) సమావేశం కూడా జరగనుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని వైసీపీ భావిస్తోంది.









